మార్చి 6న చిన్న జీయర్ చేతుల మీదుగా స్వర్ణగిరి దేవాలయం విగ్రహ ప్రాణ ప్రతిష్ట
అఖిలభువన జన్మస్తేమ భంగాది లీలుడని భగవద్ రామానుజులచే కీర్తింపబడిన అఖిలాండ కోటీ బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి నూతన దేవాలయం మన తెలంగాణా, యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి సమీపంలో నిర్మింపబడినది.
పరమహంస పరివ్రాజకులు, ఉభయవేదాంత ప్రవర్తకాచార్యులు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి మంగళాశాసనములతో,
ప్రముఖ వ్యాపార వేత్త శ్రీమాన్ మానేపల్లి రామారావు, వారి ధర్మపత్ని శ్రీమతి విజయ లక్ష్మీ పుణ్య దంపతుల దివ్య సంకల్పానుసారము గా వారి కుమారులు శ్రీమాన్ మానేపల్లి మురళీకృష్ణ, శ్రీమాన్ మానేపల్లి గోపీకృష్ణ గారల నేతృత్వం లో అత్యంత సుందరంగా ఈ ఆలయం నిర్మింపబడినది.
సుమారు 22 ఎకరాల ప్రాంగణం లో “స్వర్ణగిరి” అని నామకరణం గావించబడిన కొండ మీద శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం శ్రీ పాంచరాత్ర ఆగమ, తెన్నాచార్య సంప్రదాయమును అనుసరిస్తూ, ప్రాచీన శిల్ప శాస్త్ర రీతులను అవలంబిస్తూ సువిశాలముగా “యాదాద్రి తిరుమల దేవస్థానం” పేరుతో రూపుదిద్దుకున్నది.
ఈ దివా స్వర్ణగిరి - యాదాద్రి తిరుమల ఆలయంలో సుమారు 12 అడుగుల ఎత్తైన బృహత్ విగ్రహ రూపంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారు కొలువైన ఉంటారు.
శ్రీవారితో పాటుగా శ్రీ పద్మావతి దేవి, శ్రీ గోదా దేవి, శ్రీ మదన గోపాల కృష్ణ స్వామి, శ్రీ గరుడాల్వార్, శ్రీ రామానుజాచార్య ఉపాలయాలు నిర్మింపబడ్డాయి. ఈ క్షేత్రమ్ తెలంగాణలోని అతిపెద్ద శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం గా చెప్పుకోవచ్చు.
పల్లవ, చోళ , చాళుక్య హొయసల, విజయ నగర , నాయక శిల్ప రీతులతో నిర్మించిన ఈ ఆలయాన్ని ప్రపంచ ప్రసిద్ధ స్థపతి శ్రీమాన్ DNV ప్రసాద్ స్థపతి తన అసమాన ప్రతిభతో రూపకల్పన చేసారు. అంతే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి అనేక మంది శిల్పులను సమీకరించి ఆలయ నిర్మాణాన్ని ఆద్యంతమూ పర్యవేక్షించారు. శ్రీమాన్ DNV ప్రసాద్ స్థపతి గతం లో సమతామూర్తి శ్రీ రామానుజాచార్య, 108 దివ్యదేశ ఆలయాల రూపశిల్పి.
ఈ దేవాలయ ప్రధాన ఆకర్షణలు కొన్ని ప్రత్యేకతలని ఇక్కడ సంక్షిప్తముగా వివరిస్తున్నాము.
దేవాలయం మొత్తం 22 ఎకరాల విస్థీర్ణం లో నిర్మాణం జరిగింది. ఇందులో
స్వాగత తోరణం : స్వర్ణగిరి క్షేత్రానికి ప్రధాన ద్వారం గా స్వాగత తోరణం నిర్మాణము కావించబడినది. విజయ నగర , నాయక శిల్ప శైలి లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాలు, ఎత్తైన శంఖు, చక్రాలు మరియు భగవద్ రామానుజాచార్యులు వారు విగ్రహాలతో ఈ ద్వారం నిర్మాణము కావించ బడినది.
స్వాగత తోరణం నుండి ముందుకు సాగే మార్గానికి “రామానుజ మార్గం” అని పేరు. ఆ మార్గం లో ముందుకు సాగితే మనకు “బ్రహ్మ రథం” కనిపిస్తుంది.
బ్రహ్మ రథం : విశిష్ఠమైన స్వాగతాన్ని వర్ణిచేటప్పుడు “ బ్రహ్మరథం” పట్టారు అని అంటారు. స్వర్ణ గిరీశుని దర్శించడానికై వచ్చే భక్తులకు స్వాగతం పలికుతున్నట్లు గా ఇక్కడ “బ్రహ్మ రథం” ఉంది. ప్రాచీన రథనిర్మాణ లక్షణాలను అనుసరిస్తూ ఈ రథం శిలా మాయం గా నిర్మితమైనది.
అక్కడి నుండి కొంచెం ముందుకు వెళితే శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయి.
శ్రీవారి పాదాలు:
తిరుమల మొదటి మెట్టు అలిరిపి లో మనక శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయి. భగవద్ రామానుజాచార్యుల వారిగురువుగారైన శ్రీ తిరుమల నంబి గారి వద్ద శ్రీ రామాయణం అభ్యాసం చేసేటప్పుడు తిరుమల నంబి గారి మధ్యాహ్న ఆరాధన పొందేందుకు శ్రీ వెంకటేశ్వర స్వామివారు తన పాదాలను శిలామయం గా అక్కడ అనుగ్రహించారు. అవే పాదాలను అలిపిరిలో ఎప్పటికీ మనం దర్శించుకుంటున్నాము. ఆ విశేషసందర్భానికి గుర్తుగా స్వర్ణగిరి మొదటిమెట్టు వద్ద ఇక్కడ శ్రీవారి పాదాలను ప్రతిష్టించుకున్నాము. ఆ పాదాలకు అటు ఇటు జయ విజయ ద్వారపాలకులు సూచీ హస్త ముద్రతో శ్రీవారి క్షేత్రం లోనికి పవిత్రమైన భక్తీ భావం తో ప్రవేశించమని సూచిస్తూఉన్నారు.
ఆ పక్కనే రోడ్డుమార్గం వద్ద శ్రీ రామానుజాచార్యస్వామి వారి శిలామయ విగ్రహం ఒక శిల్పశోభిత మండపంలో ప్రతిష్టితమై ఉంటుంది. ఆ రోడ్డు మార్గానికి ఆళ్వార్ మార్గము అనిపేరు.
ఆ ముందుకు ప్రవేశిస్తే శిలామాయ తోరణాలు గోచరిస్తాయి. వాటిపైనా బ్రహ్మ , శివుడు సతీ సమేతం గా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శిస్తూ ఉంటారు. ఆముందు మనకుబ్మట్ల దారి కనిపిస్తుంది. దానికి వైకుంఠ మార్గము అనిపేరు. శ్రీవారి భక్తులు, శ్రీహరి దాసులు తమ భక్తి గానాలతో శ్రీవారిని దర్శించేందుకు ఈ మార్గం ద్వారా స్వర్ణగిరికి చేరుతారు. ఈ మార్గం లో మనకు దశావతార విగ్రహాలు వరుసగా దర్శనమిస్తాయి.
మానేపల్లి విజయ స్తంభము:
స్వర్ణగిరికి చేరగానే ఎదురుగా మనకు 54 అడుగుల ఎత్తైన ఏకశిలా స్తంభం కనిపిస్తుంది. పూర్వం మహారాజులు తమ విజయాలకు ప్రతీకగా ఏళ్ల శిలా స్తంభాలు ఆలయాల వద్ద స్థాపించేవారు. వాటికి విజయ స్తంభం లేదా కీర్తి స్తంభాలు అని పేరు. ఈ ఆధునిక కాలం లో భగవంతుని సేవ కంటే గొప్ప విజయమేముంటుంది…!? ఈ ఆలయ నిర్మాణం ద్వార శ్రీవారిని సేవించుకునే భాగ్యాన్ని తాము పొందటమేగాక ఈ ఆలయాన్ని లోకార్పణం గావించియావన్మంది భక్తులకు శ్రీవారిని సేవించుకునే భాగ్యాన్ని కల్పించిన మానేపల్లి కుటుంబ భక్తికి, దాతృత్వానికి, ఔదార్యానికి ప్రతీకగా దీనికి “ మానేపల్లి విజయ స్తంభము” అనే నామకరణంతో ఈ విజయ స్తంభాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. లత అలంకార పూర్ణమయిన ఈ స్తంభ పీఠం మంగళ ప్రదమైన గజరాజములు, సింహాలు, వృషభము లతోపాటుగా, శ్రీవారు, శ్రీదేవి భూదేవి మరియు గరుడాల్వారు విగ్రహాలు శిల్పీకరించ బడ్డాయి.
అక్కడినుండి చూస్తే ఒక ఆకాశంలోకి దూసుకుపోతుందా అనిపించేటట్లు ఒక ఎత్తైన మహారాజ గోపురం కనిపిస్తుంది. శ్రీ వైకుంఠానికి నాలుగు వైపులా నాలుగు ద్వారాలుంటాయి. శ్రీవారు కొలువై ఉండే ఈ దివ్య భావాయ ఆలయానికి కూడా ఒకే పొడవైనా ప్రాకారము దానికి నాల్గువైపులా నాలుగు రాజ గోపురాలు నిర్మితమై కనువిందు చేస్తున్నాయి. గో అంటే రక్షించునది అని పేరు. పురమును రక్షించునది అని అర్థము. పిడుగుపాట్ల నుండి పురము ను రక్షించునది కనుక గోపురము అనిపేరు. గో అంటే ఆవు, వేదములు, దేవతలు అని అర్థం. సకల వేద స్వరూపము, దేవతానిలయమైన ఈ గోపురాలకు నమస్కరించి ఆలయ ప్రవేశం చెయ్య వలెను. పూర్వ ఆలయాలలో మహారాజుల పేరులతో విగ్రహాలతో ఉన్న రాజ గోపురాలను మన చూడవచ్చు. శ్రీ శైలం లో శివాజీ గోపురం, శ్రీ కృష్ణ దేవరాయ గోపురం, మొదలైనవి. ఇవన్ని ఒక చారిత్రక సందర్భాన్ని ముందుతరాల వాళ్లు జ్ఞప్తికితెచ్చుకునేలా ఏర్పడ్డాయి. అయితే ఈ దేవాలయ గోపురాలు నాలిగింటి విషయంలో మానేపల్లి కుటుంబం వారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. వెయ్యేండ్ల క్రితం ఈ భువనగిరిని రాజధానిగా చేసుకుని, ఆ కనిపించే భువనగిరి కోటనుండి ఈ తెలంగాణా ప్రాంతాన్ని పరిపాలించిన కల్యాణి చాళుక్య రాజుల బిరుదాలను ఈ మహారాజ గోపురాలకు నామకరణం చేసారు.
Comments
Post a Comment